దూకుడు మనస్తత్వం, వివాదాస్పద వైఖరికి సుపరిచిత చిరునామా అయిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మళ్లీ సంచలన పరిణామంతో తెరమీదకు వచ్చాడు. ఈ దఫా ఏకకాలంలో ఇటు అమెరికా అటు ప్రపంచం భయకంపితులుగా మారే ప్రకటన చేశాడు. త్వరలో వ్యూహాత్మక ఆయుధాన్ని పరిచయం చేసి ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సంచలన ప్రకటన చేశారు. ఇటీవల జరిగిన వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా కేంద్ర కమిటీ సమావేశంలో కిమ్ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఆ దేశ అధికార మీడియా ‘కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ’ తెలిపింది.
ఉత్తర కొరియా అధికార మీడియా ప్రకారం, ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ద్వైపాక్షిక చర్చలను అమెరికా ఏకపక్షంగా నిలిపివేయడంపై కిమ్ మండిపడ్డారు. అణ్వాయుధాల తయారీ, ఖండాంతర క్షిపణుల పరీక్షలపై ఇన్నాళ్లూ తాము స్వీయనియంత్రణ పాటించామని, ఇకపై అలా ఉండదని చెప్పారు. తాత్కాలికమైన ఆర్థిక ప్రయోజనాలకు తలొగ్గి దేశ భద్రతను తాకట్టు పెట్టబోమని కిమ్ పేర్కొన్నారు. తమ దేశంపై కుట్రలు, అణుదాడి హెచ్చరికలు పెరిగిపోతున్నాయని, ఈ నేపథ్యంలో వ్యూహాత్మక ఆయుధాన్ని రూపొందిస్తున్నట్టు చెప్పారు. తమ దేశ ప్రజలు ఇన్నాళ్లూ అనుభవించిన బాధలకు సమాధానంగా, ఇన్నాళ్లూ నిలిచిపోయిన అభివృద్ధిని కొనసాగించేలా అనూహ్య చర్యలకు దిగుతామని హెచ్చరించారు. ఉత్తరకొరియాపై అమెరికా ఒత్తిడి కొనసాగుతున్నంత కాలం అణు నిరాయుధీకరణ జరిగే ప్రసక్తే లేదని, ఐక్యరాజ్యసమితి తన ఆంక్షలను ఉపసంహరించుకునేవరకు దేశ భద్రత కోసం వ్యూహాత్మక ఆయుధాల తయారీ కొనసాగిస్తామని స్పష్టంచేశారు.
ఉత్తర కొరియా వద్ద ప్రస్తుతం 50 అణ్వాయుధాలు ఉన్నట్టు అంచనా. శత్రు క్షిపణులను నిర్వీర్యం చేయగలిగే రక్షణ వ్యవస్థలు కూడా ఉన్నాయి. అమెరికాను చేరుకోగలిగే ఖండాంతర క్షిపణిని తయారు చేస్తున్నారు. సాధారణంగా అణ్వాయుధాలను మోసుకెళ్లగలిగే వ్యవస్థలను వ్యూహాత్మక ఆయుధాలుగా పిలుస్తుంటారు. అయితే క్షిపణి పరీక్షలను పునరుద్ధరిస్తామని స్పష్టంగా ప్రకటించకుండా, దౌత్యపరమైన చర్చలకు తలుపులు తెరిచే ఉంచారు.
The post ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సంచలన ప్రకటన appeared first on Telugu Bullet.
(TELEGU BULLET)